Search This Blog

Saturday, December 31, 2016

శ్రీమద్భాగవతం - 89వ భాగం

శ్రీమద్భాగవతం - 89

శ్రీకృష్ణుని అష్ట భార్యలు

కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో వున్న పాండవుల వద్దకు వెళ్ళాడు. అక్కడ పాండవుల చేత సేవింపబడుతున్నాడు. కుంతీదేవి కృష్ణపరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ ఆయన యందు పరమాత్మ తత్త్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేదో. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత యితర పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జునునియందు ప్రీతి ఎక్కువ. అందుకనే ఆయన అర్జునునకు సారధ్యం చేస్తూ ఉంటాడు. దాని వెనకాతల వున్న రహస్యం వేరు. యాత్ర యోగేశ్వరః కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః!తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ!!ఎక్కడయితే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో, అక్కడ మన వెనకాతల కూర్చుని మన రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి, ఆయనకు పగ్గములు అప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు. అనేకమయిన మృగములను వేటాడి డస్సిపోయారు. దాహం వేసింది. ఇద్దరూ యమునా నదిలోని నీటిని దోసిళ్ళతో తీసుకుని త్రాగారు. ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు. వేటాడిన మృగములన్నింటిని ఇంద్రప్రస్థమునకు పంపించారు. వారిద్దరూ మాట్లాడుకుంటూ వుండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ నిండు యౌవనంలో ఉంది. మహా సౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్లి పలకరించాడు. ‘అమ్మా నీవు చాలా అందగత్తెవి. మంచి యౌవనములో వున్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా వున్నావు. కాబట్టి నీవు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియజేయవలసింది’ అని అడిగాడు. అపుడు ఆవిడ ఒక చిత్రమయిన జవాబు చెప్పింది. ‘నేను సూర్య నారాయణ మూర్తి కుమార్తెను. నన్ను కాళింది అని పిలుస్తారు. నేను యమునానదిలో ఉంటూ వుంటాను. నేను జన్మించినప్పుడు నాతండ్రి ఒకమాట చెప్పాడు. యమునానది ఒడ్డున ఒకరోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునలోని నీళ్ళు తాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు. చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు’ అని మా తండ్రిగారు నాకు చెప్పి ఉన్నారు. అందుచేత నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను’ అని చెప్పింది. అపుడు అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి ‘వారే కృష్ణ భగవానుడు’ అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థమునకు పంపిస్తాడు. తరువాత కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి కృష్ణుని భార్యలు నలుగురు అయ్యారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది.ఆతరువాత ఒకసారి కృష్ణ పరమాత్మ ఖాండవ వనమును దహించడం కోసం అర్జునుని తీసుకువెళ్ళారు. ఖాండవ వన దహనం అయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాండీవమును అక్షయ బాణ తూణీరములను అర్జునునకు బహూకరించాడు. కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన యింత సామగ్రి రావడం కూడా కష్టమే. కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు. ఆర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో మలచుకున్నాడు. అదీ శ్రీకృష్ణుని గొప్పతనం. తదనంతరము నందు మయుడనే రాక్షసుడు ఖాండవ వనం దహింప బడుతుంటే కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు. ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు.అవంతీ రాజ్యమును విందానువిందులు అనబడే వారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరి తల్లిగారి పేరు రాజాధిదేవి. ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త. ఆవిడకి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవిందను ఆమె సోదరులయిన విందానువిందులు దుర్యోధనునికిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు. వాళ్లకి కౌరవులంటే ప్రీతి. కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురయిన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పముతో ఆ స్వయంవర మంటపమును చేరుకొని, రాజులందరిని పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను భార్యగా స్వీకరించాడు. కోసల రాజ్యమును నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు నాగ్నజితి. ఆయన ఒక చిత్రమయిన షరతు పెట్టాడు. ‘నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర వున్న ఏడు పొగరు మోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వానికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని యిచ్చి వివాహం చేస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యమును చేరుకొని ఆ ఏడు ఎద్దుల పొగరు అణిచి వాటిని ఓడించి వీర్య శుల్కంగా ప్రకటింపబడిన నాగ్నజితిని తన భార్యగా స్వీకరించారు.కృష్ణ భగవానుడి వేరొక మేనత్త ఉంది. ఆవిడ పేరు శ్రుతకీర్తి. శ్రుతకీర్తికి ఒక కుమార్తె ఉంది. ఆమెపేరు భద్ర. ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక. కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు.తదనంతరము మద్రరాజు కుమార్తె అయిన లక్షణ అనబడే కన్యను వివాహం చేసుకున్నారు. అలా భగవానుడికి ఎనమండుగురు భార్యలయ్యారు. అష్టభార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుచున్నాడు. ఎనమండుగురు భార్యలు అని చెప్పడం వెనక ఒక రహస్యం ఉంది. యథార్థమునకు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరససల్లాపములతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు. కృష్ణ పరమాత్మ అవతారమును అర్థం చేసుకోవడం చాలా కష్టం. భార్య అనే శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు. భార్య అనగానే ఆమె భర్తతో ఆరు రకములయిన సంబంధములను కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఈ ఆరు లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు. భార్య అనునది భర్తకి మాత్రమే చెందినది. ఈశ్వర చైతన్యం లేకపతే ఎనిమిది వస్తువులు జడం అయి ఉండిపోతాయి. ప్రకృతి ఎనిమిది రకములుగా భాసిస్తూ ఉంటుంది. భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ!అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా!!అవే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములనబడే పంచభూతములు మరియు మనస్సు బుద్ధి అహంకారములు. మొత్తం ఎనిమిది. ఈ ఎనిమిదింటి సంఘాతమే ఈ శరీరము. ఈశ్వరుడు పురుషుడై జడమయిన ప్రకృతికి చైతన్యము కలిగిస్తాడు. ఈ ఎనిమిది ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి. ఈశ్వరుడు లేకపోతే శివము శవము అయిపోతుంది. ఈ ఎనిమిదింటిని కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు ఎనమండుగురినే చేసుకోవాలి. అందుకనే కృష్ణునికి భార్యలు ఎనిమిదిమంది. ఇదీ అందులో వున్న రహస్యం. జ్ఞాన స్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది. అందుకనే భాగవతమును రెండుగా వినాలని చెపుతారు. అర్థమయిన చోట జ్ఞానిగా వినాలి. అర్థం కాని చోట భక్తునిగా వినాలి.

Friday, December 30, 2016

శ్రీమద్భాగవతం -- 88వ భాగం

#శ్రీమద్భాగవతం -- 88

శ్యమంతక మణి ఉపాఖ్యానము
ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి అంతఃపురంలో కూర్చుని ఉండగా సత్రాజిత్తు ద్వారక నగరమునకు విజయం చేశాడు. ఆయనను చూసి ద్వారకా నగరంలో ఉండే గోపాలురందరూ కూడా సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని భ్రమపడ్డారు. ఎందఱో మహర్షులు, తపశ్శాలురు, తేజోమూర్తులు దేవతలు కృష్ణుడి దర్శనమునకు వస్తూ ఉండడం అక్కడ రివాజు. కాబట్టి సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. అనుకుని పరుగు పరుగున వెళ్లి కృష్ణ భగవానుడికి చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి ఆ వస్తున్నవాడు సూర్య భగవానుడు కాదు. సత్రాజిత్తు అనే రాజు. ఆరాజు సూర్య నారాయణ మూర్తికి చేసిన ఆరాధనకు ప్రసన్నుడయిన పరమాత్మ ఆయనకు స్యమంతక మని అనబడే మణిని బహూకరించారు. ఆ స్యమంతకమణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయనను చూసి మీరు సూర్య నారాయణుడే అని భ్రమపడ్డారు’ అని చెప్పాడు.సత్రాజిత్తు ధరించిన మణికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా మణులు ఏడో అలంకార ప్రాయమై మేడలో వేసుకునేందుకు పనికి వస్తాయి. కానీ ఈ స్యమంతకమణి ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉంది. ఎక్కడ స్యమంతక మణి ఉంటుందో అక్కడ దుర్భిక్షము రాదు. అక్కడ రోగములు రావు. అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధమయిన మానసికమయిన పీడలు పొందకుండా ఉండగలరు. ఇన్ని లక్షణములతో పాటుగా ఆ స్యమంతక మణికి ఒక శక్తి ఉంది. అది ప్రతిరోజూ తెల్లవారే సరికి ఎనిమిది బారువుల బంగారమును పెడుతుంది. ఆమణిని ధరించి మణులలో కెల్లా మణి అయినవాడు ఎవడు ఉన్నాడో అట్టి కృష్ణ పరమాత్మ దగ్గరకు వస్తున్నాడు. ఈ వార్త ముందే కృష్ణునకు చేరింది. వస్తున్నవాడు సత్రాజిత్తు అని తెలుసుకున్నాడు. సత్రాజిత్తు స్యమంతకమణితో వచ్చి కృష్ణ దర్శనం చేశాడు. కృష్ణ పరమాత్మ నోరువిప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకి లేక కాదు! ఆయనకు చేత కాక కాదు! కేవలం తన మాయాశక్తి చేత ఎక్కడో మథురలో ఉండే కొన్ని లక్షలమంది ప్రజలను సముద్రంలో ద్వారకానగర నిర్మాణం చేసి జరాసంధునికి దొరకకుండా, ఒక్క ఆవు కూడా మరణించకుండా అందరినీ తీసుకువచ్చి ద్వారకా నగరమునకు చేర్చిన మహా పురుషుడికి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణి అడిగితే తప్ప ఆయనకు ఐశ్వర్యం ఉండదా? ఆయన మాధవుడు. లక్ష్మీపతి. లక్ష్మీదేవి ఆయనకోసం రుక్మిణిగా నడిచి వచ్చింది. ఆయనకు ఉన్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకు ఉన్న ఐశ్వర్యం ఏపాటి! సత్రాజిత్తును చూసి కృష్ణ పరమాత్మ ఈ మణిని నీవు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనములు ఉంటాయి. రాజ్యమునందు ఏ విధమయిన అరిష్టము ప్రబలదు. నీ ఒక్కడి దగ్గర ఉండడం వలన అది నీకు కొంత యిబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఆ స్యమంతకమణిని ప్రభువుకి బహూకరించు అని కృష్ణ పరమాత్మ అన్నారు.అనగానే వచ్చిన సత్రాజిత్తు మనస్సులో ఒక ఆలోచన బయలుదేరింది. ఆమణిని యాదవ విభునకీయవలసినదని కృష్ణుడు చెప్తే సత్రాజిత్తు ధనేచ్ఛచేత ఆ మణిని యివ్వడానికి అంగీకరించలేదు. మణిని యివ్వకపోతే కృష్ణుడు తనను ఏమీ చేయలేడని భావించాడు. కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కొద్దిగా పక్కకి తొలగినట్లయితే ఉపద్రవం మిమ్మల్ని సముద్రం ముంచెత్తినట్లు ముంచెత్తేస్తుంది. కొద్దిగా ఈశ్వరానుగ్రహం కలిగిందంటే ఎంతటి ప్రమాదము కూడా వానిని ఏమీ చేయదు. ప్రమాదము తప్పుకుంటుంది. కృష్ణుడు ‘నేను చెప్పాను. వినలేదు. నీవే పర్యవసానమును తెలుసుకుంటావు’ అని మనసులో అనుకున్నాడు. సత్రాజిత్తు తన గృహమునకు వెళ్ళిపోయాడు. కృష్ణుడంతటి వాడు తనను మణి అడిగాడని చెప్పుకోవడానికి సత్రాజిత్తుకు అవకాశం దొరికింది. కృష్ణుడు ఎందుకు అడిగాడు అన్నది మరిచిపోయాడు. కృష్ణుడు అడిగాడని మాత్రం ప్రచారం చేసుకుంటున్నాడు. ఒకరోజున సత్రాజిత్తు తమ్మునికి ఒక చిత్రమయిన కోరిక పుట్టింది. ఆయన పేరు ప్రసేనుడు. తాను ఆ మణిని ధరించి వేటకు వెడతానని అన్నగారిని అడిగాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించాడు. అపుడు ప్రసేనుడు మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. వాని మెడలో ఉన్న మణిని ఒక సింహము చూసి మాంస ఖండం అనుకోని అమాంతం వచ్చి ప్రసేనుడి మీదకి దూకి అతనిని సంహరించి అతని మెడలోని మణిని తీసుకుని నోట కరుచుకుని వెళ్ళిపోతోంది. అటునుండి జాంబవంతుడు వస్తున్నాడు. జాంబవంతుడు ఆనాడు రామావతారంలో వరం అడిగాడు. కానీ ఆ కోరిక కృష్ణావతారంలో తీరుతోంది. సింహము మణిని పట్టుకు పోతుంటే జాంబవంతుడు చూశాడు. సింహంతో యుద్ధం చేసి సింహమును చంపి జాంబవంతుడు తన గుహలోకి వెళ్ళిపోయాడు. అది తినే పదార్ధం కాదని కేవలం ఒక మణి అని జాంబవంతునికి తెలుసు. జాంబవంతునికి కొడుకు పుట్టి ఉన్నాడు. ఆకొడుకు ఆడుకోవడానికి ఉయ్యాల పైభాగంలో ఈ మణిని కట్టాడు. ఆ పిల్లవాడు దానితో ఆడుకోవడం ప్రారంభించాడు.సత్రాజిత్తు మణి గురించి ఎంతమంది సైన్యమునో పంపించాడు. ఎన్నోచోట్ల వెతికించాడు. అసలు ప్రసేనుడు చచ్చిపోయిన చోటుకాని, గుర్రం కాని కనపడలేదు. కృష్ణుడే ప్రసేనుడిని సంహరించి ఆ మణిని అపహరించాడు’ అని ప్రచారం చేశాడు. ఇపుడు కృష్ణుడు తనమీద వచ్చిన అపనింద పోగొట్టుకోవాలని అనుకున్నాడు. ప్రసేనుడు వేసుకుని వెళ్ళాడు అని తెలుసుకుని బంధుమిత్రాదులను తీసుకుని మణిని వెదకడానికి అడవిలోకి బయలుదేరాడు. అడవిలో ఒకచోట ప్రసేనుడి గుఱ్ఱము, అతని కళేబరము కనపడ్డాయి. ప్రసేనుడిని ఎవరో చంపి ఉండాలని గ్రహించి వెతకగా సింహం అడుగుజాడలు కనపడ్డాయి. వాటి దగ్గర భల్లూకపు అడుగుజాడలు కనపడ్డాయి. అంటే సింహమును భల్లూకం చంపి ఉంటుందని భావించారు. ఈసారి భల్లూకం వెళ్ళిన వైపు వెళ్ళగా గుహలో ఉయ్యాలమీద మణి వ్రేలాడుతోంది. కృష్ణుడు ఆ మణిని తీసుకుని వెళుతుండగా జాంబవంతుడు వచ్చాడు. ఆకార స్వరూపముల చేత కృష్ణుడు తన స్వామియే అని గుర్తించలేకపోయాడు. వారిరువురి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. జాంబవంతుడు కృష్ణునితో యుద్ధం చేసి డస్సిపోయి ఒంటిలోంచి రక్తం కారుతుండగా క్రింద పడిపోయాడు. తనని ఓడించినది ఎవరా అని చూడగా ఈ కృష్ణుడు ఆ రాముడు ఒక్కడే అని తెలుసుకుని ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేసి మణిని, జాంబవతి అనే కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసి పంపించాడు. తరువాత బలరాముడు మొదలయిన వారందరితో సభాచేసి సత్రాజిత్తును పిలిచి అందరూ చూస్తుండగా నేను అపహరించాను అన్నావు. దీనిని జాంబవంతుడు తీసుకు వెళ్ళాడు. నీ మణిని నీవు తీసుకో’ అని మణిని ఇచ్చివేశాడు. మణిని తీసుకొని ఇంటికి వచ్చేశాడు సత్రాజిత్తు. కొన్నాళ్ళకి సత్రాజిత్తులో కృష్ణుని అనవసరంగా నిందించాననే భావన ఏర్పడి జాంబవంతుడు ఏం చేశాడో తాను కూడా అదే చేయాలనుకున్నాడు. సత్యభామ రాజనీతిజ్ఞురాలు, యుద్ధ నీతిజ్ఞురాలు. ఆమెకు ఎన్నో విద్యలు తెలుసు. అన్నిటికీ మించి సౌందర్యాతిశయములు కలిగినటువంటి స్త్రీ. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి సత్యభామను మణిని స్వీకరించమని అడిగాడు. శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుని మణిని నిరాకరించాడు. కొన్నాళ్ళు అయిపొయింది. కృష్ణుడు ద్వారకలో లేని సమయం చూసి సత్రాజిత్తును చంపి స్యమంతకమణిని ఎత్తుకు రావడానికి శతధన్వుడు సత్రాజిత్తు అంతఃపురమునకు వెళ్ళాడు.సత్రాజిత్తు గాఢనిద్రలో ఉన్నాడు. శతధన్వుడు సత్రాజిత్తును చంపివేసి మణిని తీసుకుని పారిపోయి కృతవర్మ, అక్రూరుల వద్దకు వెళ్ళగా ఇద్దరూ కృష్ణుడు నిన్ను వదలడు, ఎప్పుడూ మా దగ్గర కనపడకు అన్నారు. శతధన్వుడు తెల్లబోయాడు. మణి దగ్గర ఉన్నదంటే దానినుండి ప్రకాశం వచ్చే ప్రకాశం వల్ల ఎక్కడ వున్నా తన ఉనికిని పట్టేస్తారు. అందుకని మణిని అక్రూరుని యింట్లో పడవేసి శతధన్వుడు పారిపోయాడు. సత్రాజిత్తు మరణ వార్తవిని కృష్ణుడు వెంటనే వచ్చి అంత్యేష్టి సంస్కారమును చేశాడు. సత్రాజిత్తు చివరకు ఆ మణి వలననే చచ్చిపోయాడు. శతధన్వుడి వల్ల సత్రాజిత్తు మరణించాడని తెలుసుకున్న కృష్ణ పరమాత శతధన్వుడు ఎక్కడ ఉన్నా చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. కృష్ణుడితో పాటు బలరాముడు కూడా బయలుదేరాడు. శతధన్వుడు మిథిలానగరం వరకు వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ చక్రమును ప్రయోగించాడు. శతధన్వుడు మరణించి గుర్రం మీద నుంచి క్రింద పడిపోయాడు. వాని దగ్గర వెతకగా మణి కనపడలేదు. బలరాముడు వీడు ఖచ్చితంగా తన స్నేహితులయిన వారి యింట్లో ఆ మణిని పెట్టి ఉండవచ్చు అన్నాడు. కృష్ణుడు వచ్చి అక్రూరా నీవు స్యమంతకమణిని తీశావా అని అడుగుతాడేమోనని భావించి మణిని తీసుకుని అక్రూరుడు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అక్రూరుడు ఇలా చేస్తాడని మనం ఊహించం. ఎందుకు అలా చేశాడో మనం తెలుసుకోవాలి. సత్రాజిత్తు మా పరమాత్మ మీద యిన్ని నిందలు వేస్తారా అని కడుపులో ఆగ్రహం పెంచేసుకుని ఎలాగైనా సత్రాజిత్తును చంపించాలని కృష్ణుడు లేని సమయం చూసి శతధన్వుని రెచ్చగొట్టారు. వాళ్ళు అనుకున్న పని పూర్తయిపోయింది. కృష్ణుడితో వైరం వాళ్ళకి అక్కరలేదు. శతధన్వుడు చచ్చిపోయాడు. కానీ మణి అక్రూరుని చేరి ఉంది. మణి ఉన్నదని తెలిస్తే కృష్ణ పరమాత్మ అడుగుతారేమో నని వారికి పశ్చాత్తాపం కలిగింది. భగవంతునికి దూరం అయిపోయారు. అతి భక్తితో చేసిన తప్పిదములు ఈశ్వరునికి దూరం చేస్తాయి. అతిభక్తి పనికిరాదు. ఎంత దూరమయినా వారిద్దరికీ కృష్ణుడి మీద గొప్ప భక్తి ఉన్నది. అక్రూరునిలో మూడు లక్షణములు కలిసి వచ్చాయి. ఒకటి అతడు జన్మతః సాధించుకున్న ఫలితం, రెండు మహాపురుషుని తేజస్సు, మూడు అలవిమీరిన కృష్ణ భక్తి. ఈశ్వరుడే అక్కడ వున్నా భక్తుడు వెళ్ళిపోవడం వలన ద్వారకలో వర్షములు కురవడం ఆగిపోయాయి. ఈవిషయం కృష్ణుడు తెలుసుకున్నాడు. అటువంటి మహాత్ముడు ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి వీలులేదు. మీరు వెళ్లి కృష్ణ భగవానుడు పరమ సాదరంగా తీసుకు రమ్మంటున్నాడు అని అక్రూరునికి చెప్పి తీసుకురండి’ అని తన సేవకులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి అక్రూరుడికి స్వాగతం చెప్పారు. తాను తెలిసో తెలియకో ఆగ్రహంతో కృష్ణ భక్తిలో పొరపాటు చేశానని అక్రూరుడు పశ్చాత్తాపపడ్డాడు. భక్తి సంయమనం ఎంత అవసరమో స్యమంతకోపాఖ్యానం నిరూపణ చేస్తుంది. కృష్ణ పరమాత్మ అక్రూరునికి స్వాగతం చెప్పి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజనం పెట్టి నిండు కొలువుచేసి అక్రూరునితో ఒక మాట అన్నారు. ‘మహానుభావా, నీవు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడివి. నీవు వెళ్ళిపోతే యిక్కడ వర్షములు పడలేదు. మణి నీ దగ్గరే ఉంది. మణిని నేను అపహరించలేదు అనే విషయం మా అన్నయ్యకు తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకు అనుమానం వస్తుంది. నిన్ను శిక్షించి తేవడం ణా అభిమతం కాదు. ఎందుకనగా నీవు నా భక్తుడవు. నీ అంత నీవుగా యిచ్చివేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు దిద్దుకోవడం అవుతుంది. పశ్చాత్తాపం అవుతుంది. నా అన్నగారి పట్ల నేను దోషం లేని వాడనై నిలబడినట్లు ఉంటుంది’ అన్నాడు.అంతకుమించి అక్రూరుని నిగ్రహించలేదు. వెంటనే అక్రూరుడికి కన్నుల వెంట నీరు కారుతుండగా నా వలన నా స్వామికి నింద రావడమా అని తన బట్టల్లో దాచుకున్న మణిని తీసి ఇచ్చివేశాడు. కృష్ణుడు దానిని సభలోని వారందరకూ చూపించి అక్రూరునికి ఇచ్చి వేశాడు. దానిని అక్రూరుడు తీసుకువెళ్ళి తన యింటిలో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజూ ఎనిమిది బారువుల బంగారమును పెట్టేది. దానితో అక్రూరుడు ప్రతిరోజూ చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భగవంతుడికి స్మరిస్తూ కాలం గడిపాడు. జీవితాంతం అలా సేవించుకోగలిగిన ఫలితమును కృష్ణ పరమాత్మ అక్రూరునికి యిచ్చాడు. ఇప్పుడు ఆ స్యమంతక మణి ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. ఈశ్వరార్చనకు దగ్గర పెట్టుకున్న వానికి మణి బరువు కాదు. అక్రూరుడు చేసే యజ్ఞ యాగాదుల వల్ల చక్కగా వర్షములు పడేవి. దానివల్ల అందరూ శోభిల్లుతూ ఉండగా ఈ మణి అక్రూరుని వద్ద శాంతించినది. పరమోత్క్రుష్టమయిన ఈ ఆఖ్యానమును ఎవరు వింటున్నారో వారందరికీ ఒక దివ్యమయిన ఫలితం వస్తుందని చెప్పబడింది. చాలాకాలము నుండి తను చెయ్యని నేరమునకు తనమీద అపనిందతో ఉన్నవాడు ఎవరయినా ఉన్నట్లయితే తన మీద వున్నా అపనింద తాను తొలగించుకోలేకపోతే ఈ ఉపాఖ్యానమును చదివినా విన్నా, మనస్సులో ఒక్కసారి తలచుకున్నా వారికి ఉత్తర క్షణం ఆ అపనింద పోయే అవకాశం కలుగుతుంది. మహా భక్తుడయిన అక్రూరుని చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది కాబట్టి వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఇది జరగాలి అంటే భగవంతుని మీద మనకు అత్యంత విశ్వాసం ఉండాలి. దీనిని మాత్రం మనం మరచిపోకూడదు.

శ్రీమద్భాగవతం -- 87వ భాగం

#శ్రీమద్భాగవతం -- 87🌹🌹🌹
దశమ స్కంధము - ఉత్తర భాగము ప్రద్యుమ్నకుమార చరిత్ర
పోతనామాత్యుల వారు దశమ స్కంధము ఉత్తర భాగమును ప్రారంభిస్తూ అంటారు శ్రీకర! పరితోషితరత్నాకర! కమనీయ గుణగణాకర! కారుణ్యాకర! భీకరశర ధారాకంపిత దానవేంద్ర! రామనరేంద్రా!!
వారు ఏది ప్రారంభం చేసినా ఒక్కసారి రామచంద్ర ప్రభువును ప్రార్థన చేస్తారు. ‘శ్రీకర’ – సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా! అపారమయిన కారుణ్యమునకు అవధి అయిన వాడా! శత్రువులను పరిమార్చకలిగిన వాడా! రామచంద్ర ప్రభో! భాగవతం ఉత్తర భాగమును ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను’ అన్నారు. దీనిలో మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనము ఏ పనిమీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. దేహముతో తాదాత్మ్యత చెందిపోకూడదు. ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడయిన వాడికి అలవాటు కావాలి. అందుకని సంతతము ఆ భగవంతుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. ‘నా అంతటి వాడిని నేను’ అని అనడు. అలా అంటే మీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు. కానీ ఆయన మహా దయాళువు. అలా చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడములనయినా సహిస్తాడు. అందుకనే ఎంత గొప్పమాట అంటారో చూడండి! కమనీయ గుణగణాకర! కారుణ్యాకర!’ మహా కారుణ్యము కలిగినటువంటి వాడా – రామచంద్రప్రభో! అని ప్రారంభం చేశారు. మనం కూడా దీనిని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. భాగవతమును వినేవాడు, భాగవతమును చదివేవాడు జీవితములో ప్రత్యేకముగా అస్తమానూ ఈశ్వరుడిని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు.రుక్మిణీ కృష్ణుల వివాహం పూర్తయింది. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురుటికందుని చూసుకొని ఆమె పరవశించి పోయింది. ఆవిడ ఆదిలక్ష్మి. ఆమె నుండియే మిగిలిన అష్టలక్ష్మిలు వస్తాయి. ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా తల్లి ప్రేమకు అతీతముగా ఉండడానికి యిష్టపడదు. ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలు యిచ్చింది.బిడ్డడిని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది. ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపియై ప్రవేశించాడు. పురిటి పొత్తిళ్ళలో ఉన్న ప్రద్యుమ్నుడనబడే ఆ చిన్న బిడ్డడిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపివేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించ వలసిన లీల. ఈ లీలను గాని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగారంటే ఈశ్వరుని దివ్యమయిన అనుగ్రహం, కారుణ్యం, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి, ఆయన సంకల్పముతో ఎలా ఏమి జరుగుతాయన్నది మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీయందు భక్తి ప్రచోదనం అవుతుంది. ఎంత గొప్ప పద్యమును ఇచ్చారో చూడండి! తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరుకంటిమంటలందా మును దగ్ధుఁడై; పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికైవేమఱు నిష్ఠఁ జేసి హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీకామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్!!
ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి. లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుని నిర్జించగలడు. ఆ మేరకు తారకాసురుడు వరమును పొంది వున్నాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులను కలపడం కోసమని మన్మథుడు బయలుదేరాడు. మన్మథుడు శ్రీమహావిష్ణువు కుమారుడు. శ్రీమహావిష్ణువు అందం అంతా మన్మథునికి వచ్చింది. మన్మథుడు అనగా మనస్సులను మథించగలిగిన వాడు అని అర్థం. ఆయన పుష్ప బాణుడై అవతలవారి మనస్సులను కదుపుతాడు. ఇంద్రుడు అడిగితే అతడు పరమశివుని మీదకు బాణ ప్రయోగం చేయబోయాడు. ఇంతలోనే శివునిలో చిన్న మార్పు వచ్చింది. ఆయన అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చుని వింటినారి సారిస్తున్న మన్మథుడు కనపడ్డాడు. అంతే! మూడవకన్ను తెరిచాడు. కాముడు భస్మమయిపోయాడు. అతను హర తేజస్సుచేత కాల్చబడ్డాడు. అది మామూలు అగ్నిహోత్రం కాదు. మూడవకంటి మంట. ఇంక డానికి ఎదురులేదు. అటువంటి మంటయందు మన్మథుడు దగ్ధమయి పోయాడు. శివుడికి ఉన్న మూడు నేత్రములే సూర్యచంద్ర అగ్నిహోత్రములు. అటువంటి అగ్నిహోత్రముచేత కాలి బూడిదరాశియై పడిపోయాడు. మన్మథుడు కాలిపోవడం పరమశివునకు విజయము. ఎందుకనగా ఆయన కామదహనం చేశాడు. కామునికి లొంగడు. కాని మన్మథుడు దహింప బడడం వలన రతీదేవికి అపకారం జరిగింది. రతీదేవికి భర్త పోయాడు. ఇపుడు ఆమెకు ఎవరు అయిదవతనమును ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివునితో చేర్చడం వలన వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనము పొండుతారనే భావనచేత మన్మథుడు బానప్రయోగం చేశాడో, అటువంటి భర్తను తనకు యిమ్మనమని పార్వతీదేవిని, పార్వతీ పరమేశ్వర కళ్యాణం తరువాత రతీదేవి అడిగింది. అందువలన పరమేశివుని మంట చేత కాలిపోయిన మన్మథుని మరల పార్వతీదేవి బ్రతికించినది. అమ్మవారి శక్తికి పరిమితి లేదు. అందువలననే కాలి బూడిద అయిపోయిన వానిని తిరిగి బ్రతికించగలిగినది. ఆవిడ ఏదయినా చేయగలదు. అటువంటి శక్తి స్వరూపం ఆవిడ! ఆమె రతీదేవికి ఒక వరం యిచ్చింది. నీ అయిదవతనమునకు భంగం లేదు. నీ భర్త అనంగుడు అవుతాడు. శరీరం ఉండదు. కానీ నీకు కనపడతాడు. పైన ఎవ్వరికీ కనపడడు. నీకు మాత్రం కనపడతాడు’ అని వరం యిచ్చింది. రతీదేవికి తన పతిని శరీరముతో చూడాలని కోరిక కలిగింది. అపుడు పరమశివుడు మన్మథునితో అన్నాడు ‘వచ్చేసారి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినపుడు నీవు ఆయనకు కుమారుడిగా జన్మించెదవుగాక! అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు’ అని వరం ఇచ్చాడు.ఈ పుట్టిన మన్మథుడు రాక్షస సంహారమునకు శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు హరుని కంటిమంటచేత కాలిపోయిన వాడు యిప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు. భూదేవి వెళ్లి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు ‘తాను రాక్షస సంహారం చేసి భూభారమును తగ్గిసాను’ అని అభయం యిచ్చాడు. ఇప్పుడు ఆయన ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదుకదా! ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉంది. ఈయన పుట్టగానే ఈయన వలన మరణించేవాడు ఒకడు ఉన్నాడు. అతను శంబరాసురుడు అనే రాక్షసుడు. వానికి ఈ విషయం తెలుసు. తన మృత్యువునకు ఏది కారణమని భావించాడో దానిని తీసివేసే ప్రయత్నం చేశాడు. అందుకని శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని సముద్రంలోకి విసిరేశాడు. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి తన గృహమునకు వెళ్ళిపోయాడు. కానీ ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బ్రతికాడు. విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు శంబరాసురుని ఇంటికే వెళ్ళాడు. శంబరాసురునిచే విసిరి వేయబడిన వాడిని ఒక చేప మింగేసింది. ఆ చేపను జాలర్లు వలవేసి బయటకు తీసి ఒడ్డుకు వచ్చి రంపముతో దాని కడుపు కోయగా కడుపులో చంటి పిల్లాడు కనపడ్డాడు. ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడిని కానుకగా ప్రభువుకు ఇద్దామని వాళ్ళ ప్రభువు అయిన శంబరాసురుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. శంబరాసురుడు మాయకు వశుడయ్యాడు. ఈలోగా రతీదేవి తన భర్త మన్మథుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా, ఈ మాంస నేత్రముతో చూడగలిగే వానిగా పుడతాడని ఎదురుచూస్తోంది. అందుకని రతీదేవి మాయాదేవి అనే పేరుతొ శంబరాసురుని వంటశాలలో ఉంది. ఈమె శంకరాసురుని వద్దకు వెళ్లి ఆ పిల్లవాడిని తనకివ్వమని, వానిని తాను పెంచుకుంటానని చెప్పింది. ఆ పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు. ప్రపంచంలో ఎవరయినా తన భర్తను భర్తగా మాత్రమె చూడగలరు. కానీ భర్తను పసిపిల్లవానిగా రతీదేవి సాకింది. ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. రతీదేవి తన భర్త అనే భావనతోనే పెంచి పెద్ద చేసింది. ఆయనకు తాను మన్మథుడనని తెలియదు. రతీదేవికి తెలుసు. ప్రద్యుమ్నుడికి యౌవనము వచ్చిన తరువాత ఈమె ప్రవర్తనయందు చేష్టితములను కనిపెట్టాడు. ఈమె ప్రవర్తనయందు దోషమును కనిపెట్టి ‘నీవు మాతృత్వమునకే కళంకం తెస్తున్నావు. నీ ప్రవర్తన యందు దోషం కనపడుతోంది. ఎందుకు నీయందు ఈ విధమయిన విచిత్రమయిన ప్రవర్తన జరుగుతోంది?’ అని అడిగాడు. అపుడు ఆవిడ జరిగిన విషయమును తెలియజెప్పి ఆ అమ్మకు వున్నా కష్టమును పరిమార్చి నీవు మరల అమ్మవద్దకు చేరవద్డా’ అని అడిగింది. ఆయనలో వున్న మాతృ భావమును ఎవరి వైపుకి తిరగాలో వారి వైపుకి తిప్పింది. అవతార ప్రయోజనమును పూర్తి చేయిస్తోంది. అప్పుడు ప్రద్యుమ్నుడు ‘ఉత్తర క్షణం నేను ణా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను వెంటనే శంబరాసురుణ్ణి చంపేస్తాను’ అన్నాడు అపుడు ఆమె ‘నీవు అంత తొందరగా వాడిని చంపలేవు. వాడి దగ్గర గొప్ప మాయలు ఉన్నాయి. ఆ మాయలను నిర్జించడం ఎవరివల్లా కాదు. కాబట్టి నీకిప్పుడు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఒక విద్యను నీకు ఉపదేశిస్తాను. ఆ విద్యపేరు మహామాయా విద్య’ అని ఆ విద్యను బోధచేసింది. అమ్మవారికి పన్నెండు మంది ఉపాసకులను చెపుతారు.మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మథః అగస్తీరగ్నిసూర్యశ్చ ఇంద్రస్కంధశ్శివస్తథా క్రోధభట్టారకోదేవ్య ద్వాదశాని ఉపాసకాః!!
అను ఈ పన్నెండుమంది అమ్మవారి ఉపాసకుల గురించి విన్నా, వాళ్ళ గురించి చెప్పినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం ప్రక్కనే ప్రద్యుమ్నోపాఖ్యానమును ఇచ్చారు. స్త్రీలు పెళ్ళి అయిన తరువాత మాతృత్వమును కోరుకుంటారు. ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత అనుగ్రహం కలగాలి. అందుకని రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడమును అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహమును పోతనగారు కథలోకి తీసుకువచ్చారు. చూడండి ఆయన ఉపకారం. ప్రద్యుమ్నుడు మహా మాయా తత్త్వమును పొంది శంబరాసురుని మీదికి యుద్ధమునకు వెళ్ళాడు. వాడికి ఈ సత్యం తెలియగానే తోక త్రొక్కిన త్రాచులా లేచి ప్రద్యుమ్నుడితో యుద్ధమునకు బయలుదేరాడు. ప్రద్యుమ్నుడు తనకు ఉన్నటువంటి మహా మాయాశక్తి చేత అన్ని అస్త్రశస్త్రములను అణచివేసి తరువాత కత్తిలో శంబరాసురుని కుత్తుక ఖండించివేశాడు. ఎవరిచేతిలో శంబరాసురుద్ చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వానిచేతిలోనే శంబరాసురుడు చచ్చిపోయాడు. అలా చంపివేసిన తరువాత ఒక చిత్రం జరిగింది. వెంటనే ప్రద్యుమ్నుడు అమ్మని చూడడానికి వెళ్ళాలి కదా! ఇక్కడ జరుగుతున్న విషయములన్నీ కృష్ణుడికి తెలుసు. కానీ ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్లు ఊరుకున్నాడు. శంబరాసుర సంహారం జరగాలని ఆయనకి తెలుసు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి తప్ప ఆయన చేసింది మనం చేయకూడదు. కృష్ణుడిది పరిపూర్ణావతారం. కృష్ణుడిని అనుకరించకూడదు.ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశమార్గంలో రుక్మిణీదేవి అంతఃపురమునకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్ర గుద్దినట్లు అలానే ఉంటాడు. అంతఃపుర పరిచారికలు అచ్చం శ్రీకృష్ణునిలా ఉన్న ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడే వస్తున్నాడని ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభముల చాటుకి తప్పుకున్నారు. కొందరు కృష్ణుని కొడుకులా ఉన్నాడు అనుకున్నారు. రుక్మిణీదేవి మందిరం ఎక్కడ ఉన్నదా అని అమ్మ గురించి వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. పరిచారికలు రుక్మిణీదేవి వద్దకు వెళ్లి ‘అమ్మా, ఎవరో ఆకాశమునుండి మన మందిరంలోకి దిగారు. అచ్చం కృష్ణుడి లాగానే ఉన్నారు. మీరు చూడవలసినది’ అని చెప్పారు. వెంటనే రుక్మిణీదేవి గబగబా మేలిముసుగుతో వచ్చి చూసింది. ఆవు దూడను చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయిపొయింది. ఆమెలో పుత్రవాత్సల్యం తన్నుకు వచ్చి ఆమె స్తన్యములలో పాలు చేపునకు వచ్చాయి. ఆవిడ అంది “ఈపిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే యిప్పటికి యింత అయి ఉండేవాడు. ఈతడు నా కొడుకే అయివుండాలి’ అనుకుంది. అమ్మ యిరువది అయిదేళ్ళ తరువాత తన కుమారుని గుర్తు పట్టేసింది. ఈలోగా అక్కడికి కృష్ణ భగవానుని తీసుకువచ్చారు. ఆయన మహా మాయావి. ఆయన వచ్చి ఒకసారి రుక్మిణి వంక, ఒకసారి ప్రద్యుమ్నుని వంక చూసి ప్రద్యుమ్నుని ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించారు. ప్రద్యుమ్నుడు సమాధానం చెప్పేలోపల అక్కడికి మహా జ్ఞాని అయిన నారదుడు వచ్చాడు. ‘అయ్యా! నీకు తెలియని విషయమా! ఆనాడు మన్మథుడు కాలి బూడిద అయిపోతే వరం యిచ్చారు కదా! దాని ప్రకారం మన్మథుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో శంబరాసురుడు అపహరించాడు. తరువాత యితడు శంబరాసురుణ్ణి సంహరించాడు. ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు. నీ యింటికి కొడుకు కోడలు కూడా ఈశ్వర వరంగా వచ్చారు. ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకుని చేసుకున్న పెళ్ళి కాదు. ఇది జన్మజన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు. పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకొని తన భార్యత్వమును నిరూపించుకొని, భర్తను తీసుకుని వచ్చి తల్లికి అప్పజెప్పిన కోడలు! అత్తగారియందు అంత గౌరవమును చూపించిన కోడలు! యింక యింతకన్న నీకు ఏమికావాలి?’ అని చెప్పాడు.రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుడిని, రతీదేవిని ఆప్యాయతతో కౌగలించుకుంది. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురం అంతటా భేరీలు మ్రోగాయి.చచ్చిపోయాడని మనం అనుకున్న పిల్లవాడు బతికి వచ్చాడు. ఆహా! రుక్మిణీ దేవి ఎంత తపస్సు చేసినదో! మరల కొడుకు యింతవాడయి కనపడ్డాడు’ అని గోపకులందరూ

శ్రీమద్భాగవతం -- 86 వ భాగం

#శ్రీమద్భాగవతం -- 86 🌷🌷🌷

స్వామి ఈ లేఖను చదివి, దానిని పక్కనపెట్టి అగ్నిద్యోతనునీతో ‘ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు. ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను’ అన్నారు. ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు. అపుడు అగ్నిద్యోతనుడు అన్నాడు “ఆ అమ్మాయి నీకు తగినది. ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతనుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశము. అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది. అటువంటి భగవంతుని చూపించేవాడు. గురువు ఈశ్వరదర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకి తీసుకువెడతాడు. మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము. మీ యిద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈలోకంలో ఒక గొప్ప సంప్రదాయమును నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణా నీవు వెంటనే బయలుదేరి రావలసినది’ అని చెప్పాడు. ఈమాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈవిషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడికోసం పరుగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిద్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు.‘తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు?” అని బలరాముడు అడిగాడు. ‘విదర్భరాజ్యములోని కుండిన నగరమునకు రుక్మిణీ దేవిని రాక్షస వివాహం చేసుకొని తీసుకు రావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకొని వెనకాతల బలరాముడు వెళ్ళాడు.కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయనను చూసి ఏమి అందగాడురా మహానుభావుడు- ఆ నెమలి పింఛం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు , ఆ కిరీటం
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!!
ఎంత అందంగా ఉన్నాడు! నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి’ అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది.ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?విని కృష్ణుం డది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుండనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యా మహా దేవియున్నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?
‘అగినిద్యోతనుడు వెళ్ళాడో లేదో! మార్గమధ్యంలో ఏదయినా బడలికను పొందాడో! ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్లి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో యిలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో! నేను కృష్ణుని పొందగలనో లేదో’ అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు."తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుందగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱందగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతియైమగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్."
‘నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గోప్పవారో! కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు. రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులయితే ఎంత బాగుంటుందో! కానీ తండ్రి ఈమెను శిశుపాలునకిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములనన్నిటిని యిచ్చేస్తాము. మా పుణ్య ఫలములను కూడా ఆవిడే తీసుకొని కృష్ణుని భర్తగా పొందాలి’ అని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయ పడిపోతుంది.అమ్మవారు అన్న మాటలో ‘ఆర్యామహాదేవి’ అనే ఒక గమ్మత్తయిన మాట వుంది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువుపట్టు అంటారు పెద్దలు.బాణత్వం వృషభత్వ మర్థవపుషా భార్యాత్వ మార్యాపతేఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దధౌత్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహభాగో హరిఃపూజ్యాత్ పూజ్యతర స్స ఏవహి నచేత్ కోవా తదన్యోధికః!!
శ్రీమహావిష్ణువు శంకరుని అనేక రూపములతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతొ పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా, చదివినా, ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు లేదా ఐశ్వర్య భంగమైపోయినవాడు లేదా సంతానమును పొందలేని వాడు ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవాలని ఆడపిల్లకు రాసి వుంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కల్యాణం చూస్తున్నారో, వారి నొసటవ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడయిన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీకళ్యాణం చదివినా, చూసినా మనకి కొన్ని కోట్ల జన్మలనుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాము. అది పెళ్లి అయిపోయిన వాళ్లకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది.ఇప్పుడు అగ్నిద్యోతనుడు రుక్మిణీ దేవి వద్దక పరుగెత్తుకు వచ్చి ‘కన్యకా! కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీవంటి శిష్యురాలికి గురువు నయినందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకొని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసివచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది’ అన్నాడు. ఇప్పుడు రుక్మిణీదేవి పరమసంతోషమును పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల అయిదవతనం నిలబడాలంటే గౌరీతపస్సు చేయాలి. గౌరీతపస్సు చేయించేటప్పుడు ఆమెచేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలననే పొందగల్గుతారు. కన్య సువాసినిగా మారబోతోంది. ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావడానికి అన్నిటికి కావలసిన అదృష్టం అప్పుడే కతాక్షింపబడుతుంది. గౌరీతపస్సు జరుగుతున్నంత సేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీ దేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళ సూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీతపస్సు అయ్యేవరకు ఆ పిల్ల మాట్లాడకూడదు. మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమయిన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెరకు కర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువలకు ఇప్పించాడు. అప్పుడు చెప్పిందినమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పెద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయు మమ్మ! నిన్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”
సనాతనులయిన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరు యిద్దరు కూడా సనాతనముగా ఆదిదంపతులు. అమ్మా, నీవు తరగని అయిదవ తనంతో ఉన్నావు. అలా నన్ను కూడా అయిదవతనంతో నిలబెట్టవా! ఓ యీశ్వరీ, నీవు దయకు సముద్రము వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు’ అంది. తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచినది. రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందఱో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి క్రింద పడిపోయారు.కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావలగ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘ సంకాశదేహు, నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్!!
రుక్మిణీ దేవికి, రథంలో నిలబడి పట్టుపీతాంబరము కట్టుకొని, ఎడం చేతితో అలవోకగా పగ్గములు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ, నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడయిన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు. రథమును దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగివచ్చి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది. ఈశ్వర ప్రతిజ్ఞ! తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమందీ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నారు. ఎవరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది. కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గరకు వెళ్ళాడు జరాసంధుడు అన్నాడుబ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన. బ్రతుకు కలిగెనేని భార్య కలదుబ్రతికితీవు; భార్యపట్టు దైవమెరుంగు, వగవ వలదు చైద్య! వలదు వలదు!!
శిశిపాలా, నీవు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్లి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్లి అయిపోతే పోయింది. మరొక భార్య దొరుకుతుంది. బ్రతికానని సంతోషపడు’ అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమయిన ఆవేశంతో కృష్ణుని రథం వెంట పడిమా సరివాడవా మా పాప గొనిపోవ? నేపాటి గలవాడ? వేది వంశ?మెందు జన్మించితి? వెక్కడ బెరిగితి? వెయ్యది నడవడి? యెవ్వడెరుగు? మానహీనుడ వీవు? మర్యాద లెరుగవు; మాయ గైకొని కానీ మలయ రావు;నిజరూపమున శత్రు నివహంబుపై బోవు; వసుధేశుడవు గావు వావి లేదు;కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు, విడువు; విడువవేని విలయకాలశిఖిశిఖా సమాన శిత శిలీముఖముల గర్వమెల్ల గొందు గలహమందు!!
రుక్మి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. ‘నువ్వు గోపాల బాలుడివి. ఎక్కడో పుట్టిన వాడివి. ఆలమందల వెనకాల తిరిగిన వాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా! మా పిల్లను ఎత్తుకు పోతావా? నిలు నిలు కృష్ణా, నిన్ను యిప్పుడే తుదముట్టించేస్తాను’ అని వస్తున్నాడు.కృష్ణుడు చూశాడు. రుక్మి తనను ఇంత నిండా చేస్తున్నాడు. కానీ అది స్తుతిపాఠం అయిపొయింది. నిజంగా పరమాత్మకు జన్మమేమిటి? కులం ఏమిటి? వంశం ఏమిటి? ఇది తెలియక వెర్రివాడు ప్రలపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రమును చేత్తో పట్ట్టుకొని సంకల్పం చేస్తున్నారు.అని డగ్గుతికతో మహాభయముతో నాకంపితాంగంబుతోవినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీకలాపంబుతోఁగనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొక్కిన రుక్మిం దెగవ్రేయఁబోక మగిడెం గృష్ణుండు రోచిష్ణుఁడై.
అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యము నీయగలిగిన శ్రీమహాలక్ష్మి తనతోడబుట్టిన వాడు మరణిస్తాడేమోనని యింకా పెళ్ళి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది, భయపడి పోయి వణికిపోతున్న శరీరముతో ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతుండగా ఈశ్వరా, నా అన్నకు ప్రాణ భిక్ష పెట్టు’ అని ఆయన పాదములు పట్టుకుంది. అపుడు కృష్ణుడు ‘వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను’ అని కిందికి దిగి, కత్తి తీసి, రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తల గెడ్డం గొరిగేసి వదిలి పెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై ఉత్తరీయము తీసి రుక్మిని బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధ పడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు. తదనంతర రుక్మిణీ కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు.ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్.br/>ఆరోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రమును నాశనం చేయగలిగినది, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరముతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది, చక్కటి చిరునవ్వుతో అందరిని ఆదరించే స్వరూపం ఉన్నది, మంచి గుణములు కలిగినది, అయిన రుక్మిణీ దేవిని కృష్ణుడు ద్వారకా నగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు.అనఘ! ఆదిలక్ష్మియైన రుక్మిణి తోడ గ్రీడ సలుపుచున్న కృష్ణు జూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి, ప్రీతి లగుచు ముక్త భీతు లగుచు!!
ఆ శ్రీమహాలక్ష్మియే రుక్మిణీ దేవి. ‘ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలియై మనలను రక్షిస్తుంది. ఇంక మనకి ఏమి కావాలి! మనం అందరం భయములను వదిలిపెట్టి పరమసంతోషంగా ఉండవచ్చు’ అని ప్రజలందరూ భావించారని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీకళ్యాణగాథ వినిపించాడు.

Tuesday, December 27, 2016

శ్రీమద్భాగవతం - 85 వ భాగం

#శ్రీమద్భాగవతం -- 85

తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడూ భగవత్సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనస్సు కృష్ణునియందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ యింటికి వచ్చేవారు పదిహేను నిమిషములు మాట్లాడితే కనీసంలో కనీసం అయిదు నిమిషములు భగవత్సంబంధమో, పిల్లలు విన్నా పనికివచ్చే మాటలో మాట్లాడేవాడు అయి వుండాలి. అంతే కానీ యింటికి వచ్చేవాడు లౌకికమయిన విషయములు, వాడి మీద గోల, వీడి మీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. ఒక యింట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమాను తలుచుకుంటుంటే యింట్లో పిల్లలకు పెద్దలఎడ భక్తి భావన గౌరవము ఏర్పడతాయి. యింట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన యింటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మయందు హృదయము కుదురు కొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మనస్సు నందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి వున్నదై ఇంతకూ పూర్వం ఏ పురుషునికీ తన హృదయంలో స్థానము ఇవ్వనిదై కులవతియై ఆచారము సంప్రదాయము తెలిసి వున్నదై కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దాము అన్న ప్రయత్నము ఉన్నది కానిదై ఇతఃపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై తన భర్తను తాను ఎన్నుకొన్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు.
బంధువు లెల్ల గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషిసింధువులై విచారములు సేయగా వారల నడ్డుపెట్టి దు స్సంధుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధము జేసి మత్తపుష్పందయవేణి నిత్తు శిశుపాలున కంచు దలంచె నంధుడై!!
నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు గలిగిన రుక్మిణీ దేవిని కళ్ళు లేనివాడై పెద్దన్న గారయిన రుక్మి శిశుపాలునకు యిస్తానంటున్నాడు. అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీ బంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాతగారి యింటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురుని చెయ్యాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలయిన వాళ్ళు వచ్చారు. ఇపుతూ రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది. ‘మహానుభావా నేను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా అన్నగారయిన రుక్మి నన్ను తీసుకొని వెళ్ళి శిశుపాలున కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చేయవలసింది’ అని అడిగింది. వెంటనే అగ్నిద్యోతనుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకా నగరమును చేరుకున్నాడు.కృష్ణ పరమాత్మ అగ్నిద్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిద్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసివున్న వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి, ఆయనకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చిన తరువాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి, ఆయన కూర్చున్న తరువాత ఆయన పాద సంవాహనం చేతూ అయ్యా మీరు ఏ దేశమునకు చెందినవారు. మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా?’ అని అడిగాడు.అపుడు అగ్నిద్యోతనుడు ‘నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుండి వచ్చాను. రుక్మిణీ దేవి మీకు యిచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవధరించవలసినది’ అని ఆలేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు.ఆ లేఖను తీసుకొని పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతనగారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకములలోని శక్తి పోతనగారి పద్యములలో ఉంది. ఆ పద్యములు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. కన్నె పిల్లలకు పెళ్లి అవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి ‘నీవు ధన్యుడవు, పదిమందిని ధన్యులను చేస్తావు. లోకమంతటికీ ఆనందమును చేకూరుస్తావు. నీవు భగవంతుడవు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి వీర్యము, తేజస్సు కలవాడివి’ అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తోంది. నేను కాని గత జన్మలలో ఎప్పుడయినా వ్రతం చేసిన దానను అయితే ఒక నోము నోచిన దానను అయితే ఒక మహానుభావుడయిన సద్గురువు పాదములు ఒత్తిన దానను అయితే మనస్ఫూర్తిగా వారి పాదములు ఒకరికి పెట్టిన దానను అయితే నాకు అటువంటి పుణ్యమే వుంటే అధముడయిన చేది ప్రభువు శిశుపాలుడు నీచేతిలో మరణించుగాక! నేను నీ దానను ఔదును గాక! అంది.ఇందులో రహస్యం అంతా ఉంది. భీష్మకుని అయిదుగురు కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగిస్తుంది. మనకి అయిదు ఇంద్రియములు. ఈ అయిదు ఎప్పుడూ చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ అయిదుగురు యింద్రియములు. చేది ప్రభువయిన శిశుపాలుడు కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. యింద్రియములను గెలవలేకపోతే శరణాగతి చేయాలి. కృష్ణా నీవు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమయిన గుణములు నాయందు ప్రవేశ పెట్ట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నాకు వున్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీదానిని చేసుకోవాలి. రుక్మిణీ నీవు చెప్పావు బాగానే ఉంది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకు వెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డువస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. అపుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మొహబుద్ధి ఏర్పడితే అంటావేమో మా వాళ్ళు నన్ను పెళ్ళికి ముందు ఊరిచివర వున్నా పరమశివుని యిల్లాలయిన పార్వతీ దేవితో కలిసి కూర్చున్న మహాదేవుడయిన శంకరుని ఆలయమునకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకొని తీసుకు వెళ్ళిపో. అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది.
అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి.ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?
ప్రాణేశా! నీ గురించి వినని ఈ చెవులు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చేయాలని ఉంటుంది. నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగానిది. నిరంతరమూ నిన్ను గాఢాలింగనం చేసుకొని నీ మేడలో వున్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు? ఎంత పెద్దపెద్ద శరీరములు వస్తే ఎందుకు? నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే.ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవునే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండునే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగునే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయునట్టి నీ యందు నా చిత్త మనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు,కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
ఈశ్వరా, నీ గుణములు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాశములు తెగిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగాలిగిన నాడు ణా నోరు నోరు. ఇంద్రపదవి అక్కరలేదు. ఈశ్వరా, నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను.నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్ధం నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన”. నీ పాదములనుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వాలే ఈశ్వరా, ఈ జన్మకే కాదు. నూరు జన్మలయినా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను. అంతేకానీ అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను’ అని ఆ లేఖలో విషయములను పొందుపరచింది.

శ్రీమద్భాగవతం - 84 వ భాగం

 #శ్రీమద్భాగవతం - 84

వారు మరికొంత లోపలికి వెళ్ళగా చాణూర ముష్టికులు ఉన్నారు. మనలో ఉన్న కామక్రోధములే చాణూరముష్టికులు. వాళ్ళు మల్లయుద్ధం చేస్తారు. వాళ్ళు పట్టుకు పట్టుకు మనలను పడగొడతారు. ఇప్పుడు కంసుడు చాణూర ముష్టికులను ప్రయోగించాడు. అజ్ఞానము ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడిని, కృష్ణుడితో చాణూరుని వేదకమీద మల్లయుద్ధం చేయమన్నాడు. వారిద్దరూ భయంకరమయిన మల్లులు. బలరామకృష్ణులు చిన్నపిల్లలు. వాళ్ళతో ఈ చిన్నపిల్లలకు యుద్ధం ఏమిటని అక్కడ వున్నవారు ఆశ్చర్యపోతున్నారు. వాళ్లకి వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోతోంది. ఇంతమందిని చంపాడు అని తెలిసిపోతోంది. వాళ్ళు అన్నారు – ‘ఇదేమీ వైకుంఠ పురం కాదు, కంసుని సభ. ఇది సంసారమును వదిలి పెట్టేసిన వారి సభ కాదు. ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు. ఇది కాలదండము లాంటి నా పిడిగుద్దు. ఇది లక్ష్మీదేవితో పరాచికములు ఆడడం కాదు. పిల్లాడా, మాతోటి యుద్ధం చేస్తావా? నీవు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు – సాగి నీవు నడవడానికి వేదాంత వీధి కాదు. రా, నిన్ను మట్టు పెడతాము’ అన్నారు. చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు. బ్రహ్మాండమయిన మల్లయుద్ధం జరిగింది. గరుడుడు పాములను పట్టుకుని ఎగరేసుకు పోయినట్లుగా వాళ్ళిద్దరూ చాణూరముష్టికులను ఇద్దరినీ సంహరించారు. వీళ్ళిద్దరూ మరణించగానే కంసుని గుండె అదిరిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు వెంటనే కత్తితీసి భటులను పిలిచి ‘వసుదేవుని సంహరించండి – ఉగ్రసేనుని సంహరించండి – ఈ గోపాల బాలురను మట్టుబెట్టండి’ అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు సింహాసనం మీదకి ఒక్క దూకు దూకి కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే కంసుడు పంచత్వమును పొందేశాడు. వాడు చచ్చిపోయాడు.కంసుని మీదకి కత్తి విసరలేదు.
జరాసంధుడు – కాలయవనుడు – ముచుకుందుడుతరువాత ఒక ముఖ్యమయిన ఘట్టం జరిగింది. జరాసంధుడు యుద్ధమునకు వచ్చాడు. కంసునికి యిద్దరు భార్యలు. వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి ‘కృష్ణుడు మా భర్తను సంహరించాడు మాకు వైధవ్యం వచ్చింది’ అని జరాసంధుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధుడికి కోపం వచ్చి ఇరువది మూడు అక్షౌహిణుల సైన్యమును తెసుకొని శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా పదిహేడు మార్లు వచ్చాడు. పదేహేడు మార్లూ అనేక అక్షౌహిణుల సైన్యమును కృష్ణుడు చంపాడు. పదునెనిమిదవ మాటు మరల జరాసంధుడు వస్తున్నాడు.ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమయిన పని చేశాడు. జరాసంధుడు మధురా నగరమును ముట్టడిస్తే అమాయకులమయిన గోపాల బాలురు మరణిస్తారని, తనకి కొంత చోటును యిస్తే అందులో జలదుర్గము కట్టుకుంటానని సముద్రుడిని చోటు అడిగాడు. సముద్రుడు చోటు యిచ్చాడు. ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్రగర్భంలో ద్వారకానగర నిర్మాణం చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమ సత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ ద్వారకా నగరునకు తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు. కాలయవనుడు అని ఒకాయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది. యాదవులు ఎవరూ కూడా ఆయనను చంపలేరు. ఆయన దగ్గరకు వెళ్ళి నారదుడు ఒకమాట చెప్పాడు ‘ నీవు అందరి మీదికి యుద్ధమునకు వెడుతుంటావు. అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు, ఒకడు ఉన్నాడు. అతనిని కృష్ణుడు అని అంటారు. మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. ఆ కాలయవనుడు అతని యవన సైన్యమునంతటినీ తీసుకొని వచ్చాడు. కృష్ణుడితో యుద్ధమునకు శత్రు సైన్యమంతా కోటబయట విడిదిచేసింది. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయటకు వస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎవరయినా ఉంటె కదా! లోపల బలరామ కృష్ణులు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా రెండు చేతులు వెనక్కు పెట్టుకొని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరకు వస్తున్నాడు. అలా వస్తున్నా వానిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తు పట్టి కృష్ణా, నీకోసమే వచ్చాను ఆగు’ అన్నాడు. కృష్ణుడు పరుగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణుని వెంబడించాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరుగెత్తి పరుగెత్తి ఒక కొండగుహ లోనికి దూరిపోయాడు. గుర్రమును వదిలివేసి కాలయవనుడు కూడా ఆ కొండ గుహలోనికి ప్రవేశించాడు. కొండగుహలో దుప్పటి ముసుగు పెట్టుకొని ఒకాయన పడుకుని వున్నాడు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి అతనిని కాలితో ఒక్క తన్ను తన్నాడు. ‘ఎవడురా నన్ను నిద్రలేపిన వాడు’ అని ఆ ముసుగులో పడుకున్న ఆయన లేచాడు. లేచి ఆయన తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కిందపడిపోయి బూడిద యిపోయాడు. అపుడు పరీక్షిత్తు ఆ దుప్పటి కప్పుకుని పడుకున్నవాడు ఎవరు?” అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు దానికి జవాబు చెప్పాడు. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు ముచుకుందుడనేవాడు ఒకడు ఉండేవాడు. ఆటను మహా తేజోసంపన్నుడు. గొప్ప భక్తుడు. రాక్షససంహారమునకు ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింబగళ్ళు యుద్ధం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఆఖరుకి కుమారా స్వామివారికి దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతనిని ఏమి కావాలో కోరుకొనమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు నిద్రపోవాలని ఉంది. నన్ను ఎవరూ నిద్రాభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి’ అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. ‘నీకు ఎవరయినా నిద్రాభంగం చేస్తే నీవు వాడికేసి చూసిన తక్షణం వాడు బూడిద అయిపోతాడు’ అని చెప్పారు. కృష్ణుడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించడు కదా! ఈవిధంగా ముచుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు.ఇపుడు పదునెనిమిదవ సారి జరాసంధుడు వచ్చాడు. బలరామ కృష్ణులిద్దరూ కోటలోనుండి బయటకు వచ్చి మరల పరుగు మొదలుపెట్టారు. జరాసంధుడు వారివెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతమనే పెద్ద పర్వతమును ఎక్కి బలరామకృష్ణులు అక్కడి పొదలలోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షములను ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్లకి బలరామకృష్ణులు కనపడలేదు. అపుడు జరాసంధుడు ఆ పర్వతము నంతటినీ తగల పెట్టెయ్యమణి తన సైనికులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతమంతా తగులపెట్టేశారు. అపుడు అగ్నిహోత్రుని కాంతులు ఆకాశమునకు అంటుకున్నాయి. బలరామకృష్ణులిద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మీదనుండి సముద్రంలోనికి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరమునకు వెళ్ళిపోయారు. కృష్ణుడు, బలరాముడు యిద్దరూ మరణించి ఉంటారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణబలరాములు మాత్రం క్షేమంగా ఉన్నారు. ఇందులో మీరు తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఉంది. ‘సంధి’ అనగా సగము. సంధికాలము వచ్చింది. యుగ సంధి వచ్చింది అంటారు. మనం ఎవరినయినా ఆశీర్వచనం చేస్తే ‘శతమానం భవతి శతాయు పురుషశ్శతేంద్రియఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతీ’ అంటూ నూరు సంవత్సరములు జీవించు అంటాము. నూరు సంవత్సరములలో సగము ఏభై. మీరు ఈశ్వరారాధన ఈ ఏభై లోపల చెయ్యాలి. ఏభై తరువాత చేసే ఆరాధన మానసికమయినది. ఏభై తరువాత అంత కలివిడిగా శరీరముతో ఈశ్వర సేవ చేయడం కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ ఏబది సంవత్సరముల వయసు లోపల పూర్తి అవాలి. జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుముతాడు. మృత్యువు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు. అనగా హృదయగుహలోకి వెళ్ళిపోయాడు. ముచుకుందుడు నిద్రలేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితి గతుడయిపోయిన వాడికి మరణం ఉండదు. కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుని తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతమును ఎక్కాడు. అలా చేయడం అనగా నిరంతరమూ భక్తితో ఉండడం. పరమభక్తితో ఉంటే మృత్యువు మిమ్ములను ఏమీ చేయలేదు. అపుడు యమధర్మరాజు గారు మీ దాపులకు రాడు. పరమభక్తుడయిన వాడిని తీసుకు వెళ్ళడానికి నారాయణుని పార్షదులు వస్తారు. శివుని పార్షదులు వస్తారు. యమదూతలు రారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్రాంతర్గతమయిన ద్వారకను అనగా ఈశ్వర స్థానమునకు చేరుకున్నాడు. ఈవిధంగా లోకమున కంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బ్రతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడు.రుక్మిణీ కళ్యాణంభాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమ స్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారువినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుండను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుండనయుఁడు రుక్మినాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలైమనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి.అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగుబాలికలతోడఁ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పుబర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాలు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

Monday, December 26, 2016

SremadBhagavatam - శ్రీమద్భాగవతం

#SremadBhagavatam #శ్రీమద్భాగవతం

భాగవతోత్తములకు అందరికి జై శ్రీ రామ్-జై శ్రీ కృష్ణా...
మనం మంగలకరమైన ఈ రోజు న భగవంతుని అవతారాల ప్రయోజనం శ్రీ భాగవతం గురించి అద్యయనం మొదలుపెడుతున్నాం...
ఆ సర్వేశ్వరునికి శత కోటి ప్రణామములతో:-

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.

$$$$$$$$$$$$$$$$$$$

భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితులలో చెప్పారు? చెప్పినది ఏడురోజులే! అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు ఏడురోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి. – డెబ్బది సంవత్సరములు కాని, తొంబది సంవత్సరములు కాని లేక –

‘శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియః ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి’

నూరు సంవత్సరములు కాని పూర్ణంగా బ్రతకనివ్వండి – కాని ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి.
ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమయిన రోజు. ఆరోజు భగవంతుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు. ఈశ్వరుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆరోజున తను ఉంది మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది? నడయాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమయిన బ్రతుకు ఏది? నిజమయిన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే! భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికివున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా! ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీమనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని వున్నా మీ మనస్సు మీకు ఇష్టమయిన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆవస్తువునండు ప్రీతిచెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరునియందు ప్రీతిచెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాసభగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది.
Sapta Vandanamulu !
🙏🙏🙏🙏🙏🙏